Saturday, September 21, 2024
Homeక్రైమ్టెన్త్ క్లాస్ డాక్టర్లు...

టెన్త్ క్లాస్ డాక్టర్లు…

చదివింది పది.. చేసేది వైద్య వృత్తి
ఇద్దరు నకిలీ వైద్యుల అరెస్ట్..
25 ఏళ్లుగా కొనసాగిస్తున్న నాటకానికి తెర..
క్లినిక్ సీజ్..
వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి
స్పాట్ వాయిస్, క్రైమ్ : నకిలీ సర్టిఫికెట్లతో నగరంలో 25 సంవత్సరాలు వైద్యులుగా చలామణవుతున్న ఇద్దరిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మట్టెవాడ, ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు నకిలీ వైద్యవిద్య సర్టిఫికెట్లతో పాటు లక్ష 28వేల రూపాయల నగదు, డాక్టర్ క్లినిక్ల నిర్వహణకు సంబంధించిన పరికరాలు, మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ హంటర్ రోడ్డు ప్రాంతానికి చెందిన ఇమ్మడి కుమార్ పదో తరగతి పూర్తి చేయగా, చార్ బౌళి ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీ టెన్త్ ఫెయిల్ అయ్యాడు. ఇద్దరూ మిత్రులు. అందునా 1997 సంవత్సరానికి ముందు నగరంలో ప్రముఖ డాక్టర్ల వద్ద సహాయకులుగా పని చేసిన అనుభవం ఉంది. దానిని అడ్వంటేజ్ గా తీసుకుని డాక్టర్లుగా చెలమణి అవుతూ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలకున్నారు. ఈ క్రమంలోనే బిహార్ లోని దేవఘర్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం నుంచి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికేట్ తో పాటు గుర్తింపు కార్డును ఐదు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. వాటి సాయంతో ఇరువురు ఇమ్మడి కుమార్ క్రాంతి క్లినిక్ పేరుతో కొత్తవాడలో వైద్యశాలను నిర్వహిస్తుండగా, సలీమా క్లినిక్ పేరుతో రఫీ చార్ బౌళి ప్రాంతంలో 25 సంవత్సరాలుగా వైద్యశాలలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ సహయకులుగా పనిచేసిన అనుభవంతో నిందితులు తమ వైద్యశాలకు సాధారణ రోగాలతో వచ్చే రోగులకు చికిత్స అందిస్తూ రోగుల వద్ద పెద్ద మొత్తంలో ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేసేవారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే నగరంలోని కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లమని సూచించేవారు. నిందితులు నిర్వహించే వైద్య శాలలోనే మందుల దుకాణం, టెస్ట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి అందిన కాడికి దండుకున్నారు. సదరు నకిలీ డాక్టర్ల విషయమై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మట్టెవాడ, ఇంతేజార్ గంజ్ పోలీసులు, వరంగల్ రీజినల్ ఆయుష్ విభాగానికి చెందిన వైద్యుల ఆధ్వర్యంలో వారి క్లినిక్ లపై దాడులు నిర్వహించి నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేశారు. ఈ నకిలీ డాక్టర్ల వ్యవహారంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, రిజీనల్ డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆయుష్ రవినాయక్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు లవణ్ కుమార్, శ్రీకాంత్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, సోమలింగం, అశోక్, స్వర్ణలత, కానిస్టేబుళ్లు సృజన్, నవీన్, సురేష్, శ్యాం, శ్రీధర్, శ్రీను, శ్రవణ్ కుమార్, నాగరాజును పోలీస్ కమిషనర్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments