Sunday, May 25, 2025
Homeజిల్లా వార్తలుస్కానింగ్ యంత్రాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్..

స్కానింగ్ యంత్రాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్..

స్కానింగ్ యంత్రాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్..
విజయవాడ, నెల్లూరు కేంద్రంగా దందా..
వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్
నిందితులను పట్టుకున్న సిబ్బందికి కమిషనర్ అభినందనలు..
స్పాట్ వాయిస్, హన్మకొండ క్రైమ్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అర్హత లేని వ్యక్తులకు లింగానిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను జేయూసీ, దామెర పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.25 లక్షల విలువగల 6 పోర్టబుల్, 12 ఫిక్సిడ్ స్కానింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన మల్లివుడి అశోక్ కుమార్, నెల్లూరు జిల్లా కావలికి చెందిన తాతపూడి కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించి సీపీ ఏవీ రంగనాథ్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

విజయవాడ కేంద్రంగా..
మే నెలలో అక్రమంగా లింగనిర్ధారణకు పాల్పడుతూ అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కూపీ లాగడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మల్లిపుడి అశోక్ కుమార్ విజయవాడలో 2012 నుంచి ఎమిలిటి కన్సల్టెన్సీ సర్వీస్ ఇంజినీర్ ఈసీజీ, అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలను మరమ్మతు చేస్తున్నట్టు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించాలనుకుని 2018లో విజయవాడలోని అబిరనగర్ లో గదిని అద్దెకు తీసుకుని సొంతంగా అస్ట్రానిక్ టెక్నాలజీ పేరుతో బయోమెడికల్ ఎక్విప్ మెంట్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసి వివిధ బయోమెడికల్ యంత్రాలను మరమ్మతులు చేసేవాడు. అందులో భాగంగా పలు హాస్పిటళ్ల స్కానర్లు మరమ్మతు చేయడం ద్వారా డాక్టర్లతో పరిచయం పెరిగింది. దీంతో అశోక్ కుమార్ ఆయా దవాఖానల్లో పాత స్కానర్లను కొనడంతో పాటు చెన్నై లో గుర్తింపు లేని బయో మెడికల్ సర్వీస్ కేంద్రాల నుంచి కూడా పాత స్కానింగ్ యంత్రాలను తక్కువ ధరకు కొనేవాడు. వాటిని అధిక ధరకు అర్హతలేని వారికి విక్రయించేవాడు. ఈ క్రమంలోనే నిందితుడు అశోకకుమార్ వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో స్కానింగ్ యంత్రాల మరమ్మతు చేసే క్రమంలో వేముల ప్రవీణ్ తో పరిచయం కావడంతో ఆయనకు అక్రమంగా స్కానింగ్ యంత్రాన్ని విక్రయించాడు. అశోక్ వద్ద ప్రస్తుతం అమ్మడానికి ఉన్న 4 పోర్టబుల్, 11 ఫిక్స్ డ్ స్కానింగ్ యంత్రాలను కేయూసీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు కేంద్రంగా..
మరో ఘటనలో గత నెలలో అక్రమంగా లింగనిర్ధారణకు పాల్పడుతుండంతో దామెర పోలీసులు అరెస్ట్ చేసిన డాక్టర్ సబిత ఇచ్చిన సమాచారం మేరకు స్కానింగ్ యంత్రాన్ని విక్రయించిన మరో నిందితుడు నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన నిందితుడు కిరణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ 2018 లో డేవిస్ మెడికల్ ఎక్విప్ మెంట్ కంపెనీ సెల్స్ మెన్ గా పనిచేస్తూ స్కానింగ్ యంత్రాల మరమ్మతు నేర్చుకున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువగా డబ్బు సంపాదించాలనుకుని 2021లో ఉద్యోగం మానేసి కావలి ప్రాంతంలో పవిత్ర టెక్నాలజీ పేరుతో స్కానింగ్ సర్వీసు సెంటర్ ఏర్పాటు చేసుకున్నాడు. పలు దవాఖానల్లోని స్కానింగ్ యంత్రాలను మరమ్మతు చేస్తూ పాత యంత్రాలను కొనుగోలు చేసేవాడు. వాటిని తిరిగి ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయించేవారు. గతంలో సేల్స్ మెన్ గా హన్మకొండకు వచ్చిపోయే క్రమంలో డా.సబితతో ఉన్న పరిచయంతో నిందితుడి ఆమెకు లక్ష రూపాయలకు స్కానింగ్ యంత్రాన్ని విక్రయించాడు. ఈ సందర్భంగా అతడి నుంచి మరో రెండు పోర్టబుల్, ఒక ఫిక్స్డ్ స్కానింగ్ యంత్రాన్ని దామెర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సీపీ అభినందనలు..
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్పీ పుష్పా, ఏహెచ్టీయూ ఇన్ స్పెక్టర్ సుజాత, కమాండ్ కంట్రోల్ ఇన్ స్పెక్టర్ వినయకుమార్, ఎస్సైలు సతీష్, సతీష్, రాజేందర్, జానీ పాషా, షేక్, ఫసియుద్దీన్, మల్లేషం, ఏఏఓ సల్మారా షా, హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావు, కానిస్టేబుళ్ల సంపత్, రాజేశ్, రవీందర్, సైబర్ క్రైం కానిస్టేబుల్ రాజు, ఏహెచ్టీయూ సిబ్బంది ఏఎస్ఐ భాగ్యలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్, కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సీపీ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments