ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు..
జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదమే ఫైనల్
నియోజకవర్గానికో ప్రత్యేకాధికారి
స్పాట్ వాయిస్, బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని సీఎం సూచించారు. ఆ కమిటీల పరిశీలన అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రికి పంపాలని.. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదించాకే ఇళ్ల జాబితా ఖరారవుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యవహారం సక్రమ పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఈ ప్రత్యేకాధికారి ఇందిరమ్మ కమిటీలు, మండల కమిటీలు, కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ఉంటారని సీఎం తెలిపారు. గతంలో ఉమ్మడి జిల్లాకు నియమించిన సీనియర్ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని, ఆయా జిల్లాల కలెక్టర్లతో పర్యవేక్షణ చేయాలని సీఎం సూచించారు. ఇళ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లకు తలొగొద్దని, ఎక్కడైనా అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే మండల స్థాయి కమిటీ, ప్రత్యేకాధికారిపై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినందున జనాభా ప్రాతిపదికన, ఆయా గ్రామాలకు ఇళ్ల కేటాయింపు ఉండాలని, ఈ విషయంలో హేతుబద్ధత పాటించాలని సీఎం సూచించారు. నిర్దేశిత సమయం ఆధారంగా ఇళ్ల నిర్మాణాలు సాగించాలని, ఇందుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు.
Recent Comments