స్పెషల్ ఆఫీసర్ కుమారస్వామి
అట్టహాసంగా ప్రారంభమై మండల స్థాయి సీఎం కప్ పోటీలు
పెద్ద సంఖ్యలో పాల్గొన్న క్రీడాకారులు
మొదటి రోజు సత్తా చాటిన ఆటగాళ్లు
స్పాట్ వాయిస్, గణపురం: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకే సీఎం కప్ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తుందని మండల స్పెషల్ ఆఫీసర్ కుమారస్వామి అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 మండల స్థాయి క్రీడా పోటీలు మండలంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ పోటీలను తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో భాస్కర్, ఎస్సై అశోక్, జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి చిర్ర రఘుతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో వాలీబాల్ ఆడి ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ కుమారస్వామి మాట్లాడుతూ.. గ్రామస్థాయి యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాక వెలుగులోకి రాలేకపోతున్నారని, అలా ప్రతిభ ఉండి వెలుగులోకి రాని వారిని గుర్తించి క్రీడల్లో ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎంపీడీవో భాస్కర్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో రెండు రోజులపాటు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని, ఇక్కడ గెలుపొందిన జట్లను జిల్లా పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు. అక్కడ ప్రతిభ చూపితే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనవచ్చన్నారు. ఎస్సై అశోక్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని క్రీడాకారులు నిరుత్సాహ పడకుండా క్రీడా స్పూర్తి చాటలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ఇంచార్జ్ హెచ్ఎం కుమారస్వామి, ఎంపీపీఎస్ హెచ్ఎం దూలం కుమారస్వామి, భూపాలపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్, డైరెక్టర్ కట్కూరి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కుమార్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపి విడిదినే అశోక్, మాజీ ఎంపీటీసి మోటపోతుల శివశంకర్ గౌడ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు చోటేమియా, మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, పీడీ కోసరి సరిత, అంజద్ పాషా, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments