మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో విషాదం
కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూత
బీఆర్ఎస్ కీలక సమావేశం వాయిదా
స్పాట్ వాయిస్, హైదారాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇంట విషాదం చోటు చేసుకున్నది. ఆయన ఐదో సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సకలమ్మ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. సకలమ్మ మరణవార్త తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్రావు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. కాగా ఆమె అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తారని బంధువులు చెబుతున్నారు. సకలమ్మ మరణంపై కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపాన్ని తెలిపారు.
*కీలక సమావేశం వాయిదా
మరోవైపు బీఆర్ఎస్ కీలక సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతోపాటు ఇతర ముఖ్య నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావాల్సి ఉంది. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతితో ఈ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. కేసీఆర్కు సకలమ్మ ఐదవ సోదరి కాగా.. ఆమెది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర. సకలమ్మ భర్త హన్మంతరావు కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. సకలమ్మ, హన్మంతరావు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మొత్తం 10 మంది తోబుట్టువులు ఉన్నారు.. వీరిలో 8 మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. 2018లో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి, మరో సోదరి లీలమ్మలు చనిపోయారు.
Recent Comments