Friday, September 20, 2024
Homeతెలంగాణమంచిరోజులొస్తాయ్.. 

మంచిరోజులొస్తాయ్.. 

మంచిరోజులొస్తాయ్.. 
పార్టీ మారినోళ్లతో నష్టమేమీ లేదు..
ఇక రెగ్యులర్ గా టచ్‌లో ఉంటా 
భవిష్యత్ బీఆర్ఎస్‌దే.. 
గులాబీ దళపతి కేసీఆర్..
పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం..
గులాబీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి క్యూ కడుతుండడంతో పార్టీని కాపాడుకునేందుకు గులాబీ బాస్ కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడగా.. 15 మంది ఎమ్మెల్యేలు సైతం.. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పుడు కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగి.. తనదైన వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. ‘‘కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్​కు వచ్చే నష్టమేమీ లేదు. వైఎస్​ రాజశేఖర్​రెడ్డి హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలే. వెన్ను చూపలే. తెలంగాణ కోసం బరి గీసి కొట్లాడినం. రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు పోయినం. ఇప్పుడు కాంగ్రెస్ చేసే పనికి ఎవరూ నారాజ్ కావొద్దు. ఆందోళన చెందొద్దు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో విఫలమైంది. భవిష్యత్తులో బీఆర్​ఎస్​కు మళ్లీ మంచి రోజులు వస్తాయి’’ అంటూ  మనో ధైర్యం కల్పించారు. 
– స్పాట్ వాయిస్, బ్యూరో
తెలంగాణను పదేళ్లపాటు ఏలిన కారు.. ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. హస్తం వ్యూహాలతో కారు ఆగమాగం అవుతోంది. ప్రతిపక్ష హోదాను కాపాడుకునేందుకు వ్యూహాలు రచించాల్సిన దుస్థితికి వచ్చేసింది. అసెంబ్లీ ఎన్నికలతో పవర్ పోవడం, ఎంపీ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడంతో.. బీఆర్ఎస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే.. గులాబీ పార్టీలోని గల్లీ నేతల నుంచి మొదలు కీలక నాయకులంతా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటుండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం హస్తం గూటికి చేరుకుంటున్నారు. దీంతో.. పార్టీ పరిస్థితి మరింత జటిలంగా మారింది. బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోందన్న వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. పార్టీని కాపాడుకునేందుకు గులాబీ బాస్ కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు.
సన్నిహితులు వీడుతుండడంతో..
 కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, సీనియర్ నేత, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరి ఊహించని షాక్ ఇచ్చారు. మరో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా.. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. గులాబీ పార్టీ అధిష్ఠానం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తనదైన వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే.. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ ఫిరాయింపులపై చర్చించినట్టు సమాచారం. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ మారడాన్ని అస్సలు పట్టించుకోవద్దని.. కొందరు స్వార్థపరులు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదంటూ చెప్పినట్టు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా.. భయపడలేదని గుర్తుచేశారు.
భవిష్యత్ మనదే.. 
భవిష్యత్‌లో బీఆర్‌ఎస్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని.. ఎవరూ తొందరపడొద్దని ఎమ్మల్యేలకు గులాబీ బాస్ సూచించినట్టు సమాచారం. ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్‌ హయాంలోనే జరిగాయని.. అయినా మనం భయపడలేదని కేసీఆర్‌ గుర్తు చేశారు. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. రేపట్నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. భవిష్యత్తులో మనకు‌ మంచి రోజులు వస్తాయని తెలిపారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు.. నిత్యం టచ్‌లో ఉండి కాపాడుకునే కొత్త వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నట్టు సమాచారం. ఇన్ని రోజులూ.. పార్టీ నాయకత్వం తమకు అందుబాటులో ఉండదంటూ తమపై ఉన్న ఆరోపణలు తిప్పికొట్టటంతో పాటు.. ప్రభుత్వ తీరుపై తమ కార్యాచరణను నిత్యం వారితో చర్చించడం ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులను కాపాడుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.
ఐదుగురు డుమ్మా..
కేసీఆర్ ఎమ్మెల్యేలు భేటీ కాగా.. ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ మారుతారనే వార్తలు వస్తుండగా.. వీరు గైర్హాజర్ తో పార్టీ మార్పు కన్ఫాం అంటున్నారు. కేసీఆర్ తో భేటీలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌ రెడ్డి, దండె విఠల్‌, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్‌, రావుల శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్‌ మధ్యాహ్నా భోజనం కూడా చేశారు
RELATED ARTICLES

Most Popular

Recent Comments