Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుఅక్క కోసం వెళ్తే.. ప్రాణం తీశాడు..

అక్క కోసం వెళ్తే.. ప్రాణం తీశాడు..

– బావమరిదిని కర్రతో కొట్టి చంపిన బావ
– మరిపెడ మండలం దుబ్బతండాలో దారుణం

స్పాట్ వాయిస్, మహబూబాబాద్(మరిపెడ): వరసకు అక్కా బావ అయిన దంపతుల ఇంటి గొడవ కాస్త చినికిచినికి బావమరిది ప్రాణం తీసింది. అక్కను కొడుతుండటంతో మందలించడానికి వచ్చిన బావమరిదిని కర్రతో కొట్టి చంపిన దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం దుబ్బతండాలో ఆదివారం రాత్రి జరిగింది. సీఐ హతిరాం నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలం దుబ్బతండాకు చెందిన భూక్య మంత్రికి వెంకటియతండాకు చెందిన భూక్య లక్ష్మికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే కొద్దికాలం సాఫీగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో గొడవ జరిగినపుడు భార్య తరపు బంధువులు వెళ్లి సముదాయించి వచ్చేవారు. అయితే గతేడాది కాలంగా భూక్య మంత్రి భార్యను చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు బాధితుడి తరపు బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి తాగి వచ్చి భార్యను గాయపర్చాడు. దీంతో భార్య లక్ష్మి తన అన్నదమ్ములకు సమాచారం ఇవ్వడంతో వారు బావాను మందలించడానికి లక్ష్మి సోదరుడు గుగులోత్ మురళి, లక్ష్మి పెదనాన్న కొడుకు గుగులోత్ పాండు(35) దుబ్బతండాకు వచ్చారు. ఈ క్రమంలో బావ భూక్య మంత్రి వరసకు బావమరిది అయిన పాండుపై కర్రతో బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పాండును వెంటనే చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పాండు భార్య మంగ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు మరిపెడ సీఐ తెలిపారు. కాగా మృతుడికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్న వయసులో పాండు మ‌ృతి చెందటంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్క కోసం వెళ్లి తమ్ముడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న తండావాసులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం దుబ్బతండాలో పోలీసులు మోహరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments