Thursday, April 17, 2025
Homeతెలంగాణపద్ధతి మార్చుకోవాలి..

పద్ధతి మార్చుకోవాలి..

మావోయిస్టుల లేఖ
స్పాట్ వాయిస్, బ్యూరో: భద్రాచలం జిల్లాలోని వైద్యులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు హెచ్చరించారు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు మెడికల్ మాఫియాకు కాసులు కురిపిస్తోందని, ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆస్పత్రులు పీడిస్తున్నాయంటూ మవోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వైద్యం పేరుతో రోజుల తరబడి దవాఖానల్లో ఉంచి అవసరం లేకున్నా టెస్టుల చేస్తూ డబ్బులు గుంజుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు ఇప్పడు దవాఖానలకు డబ్బులు కురిపించే అవకాశాలుగా మారాయని, ప్రజల నమ్మకానికి తూట్లు పొడుస్తూ కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారై.. రోగుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారని మండిపడ్డారు. ఆరోగ్య సమస్యలను అలుసుగా చేసుకుని.. మనిషిలో రకరకాల పరీక్షల పేర్లతో భయాన్ని సృష్టిస్తూ ఆసుపత్రి గల్లలను కొల్లలుగా నింపుకుంటున్నారని, ప్రైవేటు ఆస్పత్రి మొదలుకొని ప్రభుత్వ ఆస్పత్రి వరకు కాసుల కక్కుర్తికి మరిగిన వైద్యులు జనాలను పీడించుకుతింటున్నారని అన్నారు. ముఖ్యంగా భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే వైద్యులు సైతం సొంత క్లీనిక్​లకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ వైద్యంపై నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో లేనిపోని అపోహలతో భయాన్ని పెంచి తమ సొంత క్లీనిక్స్​కు తరలించుకుంటున్నారని విమర్శించారు. ప్రధానంగా మెడికల్ మాఫియాగా మారిన వైద్య వృత్తి ఫార్మా కంపెనీలతో జతకడుతూ తక్కువ ధరకు అమ్మాల్సిన మందులను బ్రాండుల పేర్లతో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇలానే ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, వైద్యులు, ల్యాబ్, మెడికల్ షాప్​ల యజమానులు తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments