అన్నదమ్ములను బలితీసుకున్న గుండెపోటు
గుండెను మెలిపెట్టే విషాదం..
కన్నీరుపెట్టిన ఊరు..
స్పాట్ వాయిస్, క్రైం: గుండెను మెలిపెట్టే విషాదం.. పగొడికి కూడా కష్టం రావద్దు అనిపించే ఆవేదన. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి పట్టణంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ మృత్యువు ఒడికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసే భోగ శ్రీనివాస్ (32) శనివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. దాంతో అతడిని సొంత ఊరైన మెట్పల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం శ్రీనివాస్ భౌతిక కాయాన్ని శ్మశానానికి తీసుకెళ్తుండగా.. అతడి అన్న భోగ సచిన్ (35) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని మెట్పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. ఆ మాట వినగానే.. ఒక్కసారిగా ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. గుండెలు అవిసేలా రోదించారు. అన్నదమ్ములు గంటల వ్యవధిలోనే మరణించడంతో.. ఆ ఊరుఊరంతా కన్నీరుపెట్టింది.
Recent Comments